పుట్టిన బిడ్డకి ఆరోగ్యం బాలేదని..ఆసుపత్రిలో డాక్టర్ దగ్గర వదిలి వెళ్ళిన మహిళ..తిరిగి వచ్చేసరికి పరిస్థితి తారుమారు

Spread the love

బిడ్డ పుట్టగానే ప్రసవవేదనను మరిచిపోయి.. ఆ శిశువు తన పొత్తిళ్లలోకి తీసుకుని తల్లి మురిసిపోతుంది. ఇది ఏ తల్లికైనా ఎంతో మధుర క్షణం. కానీ, ఓ మాతృమూర్తి మాత్రం పుట్టిన తన బిడ్డను చూడటానికి 42 ఏళ్లు పాటు నిరీక్షించాల్సి వచ్చింది. భూమ్మీద పడిన వెంటనే తనకు దూరమైన బిడ్డ.. చనిపోయాడనుకుంది ఆ తల్లి. కానీ, 42 సంవత్సరాల తర్వాత తన చెంతకు చేరడంతో ఆ తల్లి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఓవైపు తల్లి ప్రేమ ఉప్పొంగితే.. అమ్మను చూసిన ఆ కొడుకు సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. సినిమాను తలపించే అత్యంత మధురమైన దృశ్యం చిలీలో ఆవిష్కృతమైంది. అమెరికాలోని వర్జీనియా నుంచి చిలీలోని వల్దీవియాలోని తల్లి ఇంటికి భార్యాపిల్లలతో కలిసి చేరుకున్న ఆ కుమారుడు భావోద్వేగానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. చిలీ రాజధాని శాంటియాగోలోని ఓ ఆసుపత్రికి మారియా ఏంజెలికా గొంజాలెజ్‌ 42 ఏళ్ల కిందట ప్రసవం కోసం వెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు కాన్పు చేసి.. నెలలు నిండకుండా బిడ్డ పుట్టారని చెప్పి ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తిరిగి గొంజాలెన్ తన బిడ్డ కోసం ఆసుపత్రికి రాగా చనిపోయాడని.. మృతదేహాన్ని ఖననం చేశామని చెప్పారు. దీంతో ఆమె ఆస్పత్రి నుంచి నిరాశగా వెనుదిరిగారు. తన బిడ్డ ఎలా ఉంటాడో చూడలేకపోయానని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అయితే, ఆ శిశువును ఆస్పత్రి సిబ్బంది విక్రయించగా.. అమెరికా జంట దత్తత తీసుకుంది. వారి దగ్గర జిమ్మీ లిప్పర్ట్‌ థైడెన్‌ పేరుతో పెరిగి పెద్దై అమెరికా సైన్యంలో చేరాడు. జొహన్నా అనే మహిళను వివాహం చేసుకోగా.. వీరికి ఎబ్బా జాయ్‌, బెట్టీ గ్రేస్‌ అనే పిల్లలు పుట్టారు. ఇదిలా ఉండగా, 1970, 80లలో చిలీ నుంచి అక్రమంగా తరలించిన వేలాది మందిని వారి కుటుంబాలతో కలిపేందుకు నాస్‌ బుస్కామోస్‌ అనే స్వచ్ఛంద సంస్థ మై హెరిటేజ్‌ అనే ప్రాజెక్టును చేపట్టింది. ఆ సంస్థ అన్వేషణలో థైడెన్‌ శాంటియాగో ఆసుపత్రిలో జన్మించినట్లు తెలుసుకుంది.

మరోవైపు, థైడెన్‌ కూడా తన తల్లిదండ్రుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో తనకు తల్లితోపాటు ఐదుగురు తోబుట్టవులు ఉన్నట్లు బుస్కామోస్‌ ద్వారా తెలుసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షలో తాను చిలీకి చెందిన వ్యక్తినేని నిర్దారణ కావడంతోపాటు కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోలింది. తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలన్నీ పంపితేగానీ తల్లి నమ్మలేదు. చివరకు థైడెన్ తన భార్యాపిల్లలతో కలిసి చిలీ చేరుకుని, వల్దీవియాలోని తల్లిని కలుసుకున్నాడు. తల్లీ, బిడ్డ ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

మొదటిసారిగా తన బిడ్డను గుండెలకు హత్తుకుని ఆ తల్లి మురిసిపోయింది. ఈ జన్మలో తన కుమారుడ్ని చూడలేనని భావించిన ఆమె.. బిడ్డను చూడగానే ఆనంద పరవశురాలైంది. ‘నీ కోసం ఎంతగానో ఏడ్చి.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను… నిన్ను చూడటానికే ఆ దేవుడు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడు’ అని ఏంజెలికా గొంజాలెజ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.

తల్లిని చూడగానే థైడెన్‌ సంతోషం పట్టలేకపోయారు. కన్నీటి మధ్యే తన తల్లిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ‘నాకు ఒక్కసారిగా గాలి ఆడలేదు. ఆ మధుర క్షణాల్లో ఉక్కిరిబిక్కిరి అయ్యా’ అని థైడెన్‌ ఓ వార్తాసంస్థకు తెలిపారు. థైడెన్ మాట్లాడుతూ.. ‘నా వద్ద దత్తత పత్రాలు ప్రకారం నాకు సజీవ బంధువులు లేరు.. నాకు అమ్మ, నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారని నేను కొన్ని నెలల కిందట తెలుసుకున్నాను’ అని చెప్పాడు. తన లాంటి వ్యక్తుల తరపున క్రిమినల్ డిఫెన్స్ అటార్నీగా పనిచేస్తున్నానని తెలిపాడు. తల్లిని చూడగానే థైడెన్‌ సంతోషం పట్టలేకపోయారు. ‘నాకు ఒక్కసారిగా ఊపిరి ఆడలేదు. ఆ మధుర క్షణాల్లో ఉక్కిరిబిక్కిరి అయ్యా’ అని థైడెన్‌ వ్యాఖ్యానించారు.